వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ చితాభస్మంలో కత్తెర
#Telangana #Badradrikothagudem #women #doctors #governmenthospital
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. వనజ (20) అనే గర్భిణీకి ప్రసవ సమయంలో ఆసుపత్రి సిబ్బంది సరైన వైద్య సేవలు అందించలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రసవ సమయంలో శిశువు మృతిచెందగా, అనంతరం అధిక రక్తస్రావంతో తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటన మరవకముందే మరో సంచలన విషయం బయటపడింది. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గర్భిణి చితాభస్మంలో శస్త్రచికిత్సలకు ఉపయోగించే కత్తెర బయటపడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి, బిడ్డ మరణంతో విషాదంలో మునిగిపోయిన కుటుంబానికి ఈ ఘటన మరింత వేదన కలిగించింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.