జగన్ మైండ్ గేమ్.. ప్రమాదం సుమా..!
#jagan mohan Reddy #andhrapradesh #politics
మనం మళ్లీ అధికారంలోకి రావాలంటే.. శత్రువును బలహీనపర్చాలి. అది జరగాలంటే వారి హయాంలో స్టేట్ డెవలప్ కాకూడదు.. అది జరిగితే శత్రువు బలపడతాడు. అది జరగకూడదంటే స్టేట్ ను కూడా వీక్ చేసేయాలి.. అది కూడా ప్రజల భవిష్యత్ కూడా పణంగా పెట్టేసి మరీ. ఇదే కాన్సెప్ట్ ను మాజీ సీఎం జగన్ పాలో అవుతున్నారా.. అంటే అవుననే అనిపిస్తోంది. లేకపోతే అమరావతి నిలబడితే తెలుగుదేశం నిలబడుతుందనే భయంతో గతంలో దానిని ఆపేసి మూడు రాజధానులనే కాన్సెప్ట్ తెచ్చారు. లక్ష్యం క్లారిటీ ఉంది గాని.. ఎలా చేయాలో క్లారిటీ లేదు కాబట్టి అందులో ఫెయిలయ్యారు. చివరకు ఓటమి పాలై అధికారం పోగొట్టుకున్నారు. విధానాలు, నిర్ణయాలన్నీ తెలుగుదేశాన్ని ఎలా ఆపాలనే దాని నుంచే పుట్టాయి కాబట్టే అవి ఫెయిల్ అయ్యాయి. కాని మళ్లీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లున్నారు జగన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అందుకే ఇప్పుడు మావిగన్ అనే పేరు ఎత్తుకున్నారు. ఫస్టులో దానిని ఫన్నీగా తీసుకున్నారంతా. కాని దాని వెనక ఉన్న సీరియస్ ఎజెండా జగన్ కి మాత్రమే తెలుసు. మావిగన్ అనేది తెరపైకి వస్తే అమరావతి వీక్ అవుతుంది. అప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టుకునేవారిలో డైలమా పెరుగుతుంది. ఇప్పటికే మళ్లీ జగన్ వస్తే ఏంటి అనే భయం పెట్టుబడిదారులను వెంటాడుతూనే ఉంది. దానికి తోడుగా ఇలాంటి ప్రకటనలు వారిలో మరింత కన్ ఫ్యూజన్ పెంచుతోంది. ఒక రకమైన మైండ్ గేమ్ ఆడుతున్నారు జగన్ అనే అంచనాకు వస్తున్నారు రాజకీయ పరిశీలకులు. మావిగన్ అంటే మాకు.. అమరావతి అంటే చంద్రబాబుకు ఓటేయండి అని అంటే... అంటే జగన్ కు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా చెబుతారు.. అంటే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారా అనే అనుమానం కలిగించడమే ఈ ప్రకటన వెనక ఉన్న లక్ష్యం అనుకుంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో తప్పులు జరగటం లేదా అంటే కాదని చెప్పలేం. కచ్చితంగా కొన్ని వ్యవహారాల్లో తప్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యవహారశైలి బాగోలేదనే ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి. కాని విచిత్రంగా వాటిని వైసీపీ హైలెట్ చేయడం లేదు. జగన్ వాటిని పట్టించుకోవడం లేదు. ఏవైతే కూటమి తమ విజయాలుగా చెప్పుకుంటుందో వాటినే టార్గెట్ చేస్తున్నారు. విశాఖ డేటా సెంటర్ పై అలిసిపోయేలా అష్టావధానం చేశారు. ముందు తామే తెచ్చామన్నారు. జగన్ అలా చెప్పి.. తన పార్టీ నాయకుడితోనే డేటా సెంటర్ తో డేంంజర్ అని చెప్పించారు. డీఎస్సీ నిర్వహిస్తే అందులో కేవలం స్పోర్ట్స్ కోటాలోనే ఏదో జరిగిందని ఆరోపణలు చేశారు. దానిపై పదే పదే ప్రచారం చేస్తూ విసుగు తెప్పించారనే చెప్పాలి. ప్రభుత్వం పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
మొదట 11 సీట్లకే పరిమితమై వీక్ అయి సైలెంట్ అయిన వైసీపీ.. క్రమంగా బలపడినట్లు కనపడుతుందని అనిపించాలనేదే ఈ ప్రచారాల వెనక వ్యూహం అంటున్నారు. జగన్ పై అభిమానమున్నవాళ్లు ఈ వ్యవహార శైలిని సమర్ధించుకుంటూ అదీ మావాడు.. కూటమిని ముప్పతిప్పులు పెడుతున్నాడు.. ఈసారి మావాడిదే అధికారం అని చెప్పుకుంటున్నారు. అదే గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి కూటమిని బలపర్చేవాళ్లు సైతం ఈసారి మళ్లీ జగన్ వస్తాడంట కదా అనుకుంటున్నారు. మొన్న ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారమే జరగగా.. వచ్చిన ఫలితాలకు అందరూ షాక్ అవ్వాల్సి వచ్చింది. అందుకే ప్రచారం ఒకటైతే.. వాస్తవం మరోలా ఉంటుంది. అది ఎటైనా కావొచ్చు. 2019లో కూడా తెలుగుదేశం వాళ్లు మళ్లీ గెలుస్తామని దీమాగా ఉంటే ఏమైందో చూశాం. 2024లో అదే రివర్స్ అయింది.
జగన్ ప్రచార వ్యూహం కూడా త్రిశూల వ్యూహంలా మూడు వైపుల నుంచి నడుస్తోంది. ఒకటి పార్టీ నుంచి.. రెండు తమ ఫాలోవర్ చానెల్స్ నుంచి.. మూడు సోషల్ మీడియా నుంచి. చాప కింద నీరులా వైసీపీ తన వ్యూహాన్ని అమలు చేస్తుందని అర్ధమవుతోంది. యూట్యూబర్స్ ఎవరు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో.. ఏం చెబుతున్నారో చూస్తుంటే.. వారి వెనక వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది అంటున్నారు టీడీపీ వారు. ఎక్కడ అలజడి రేగినా.. ఎక్కడ కుల మతాల మధ్య చిచ్చు రగిలినా.. అన్నిటి వెనక వైసీపీ హస్తం ఉందని వారంటున్నారు. విజయవాడ సీఐనాగరాజు, సాయి క్రిష్ణ వ్యవహారంలో అదే కనపడింది. దీనిని పట్టుకుని కాపులపై నిర్లక్ష్యం అనే యాంగిల్ తెచ్చారు. ఇక ఇప్పుడు లేటెస్టుగా యూట్యూబర్స్ ఇద్దరి అరెస్టు జరిగితే.. దానికి ప్రాంతీయం, కులం అంటిస్తున్నారు. వారు ఆయా వీడియోల్లో ఎలా మాట్లాడారు.. ఏం మాట్లాడారనేది వదిలేసి అరెస్టు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కొందరు అని విమర్శిస్తున్నారు కూటమి కార్యకర్తలు.
కాకపోతే జగన్ గమనించాల్సింది చరిత్ర అంటున్నారు కూటమి వారు. కాపులను రెచ్చగొడితే వారంతా పవన్ వెనక చేరారని.. ఇప్పుడు కూడా కాపుల సమావేశాలని పెడితే.. కాపులంతా ఐక్యంగా కదిలేలా చేశారని అంటున్నారు. అలాగే ఇప్పుడు దళిత క్రైస్తవులను రెచ్చగొడుతున్నారని.. వారిలోనూ ఇప్పుడు చీలిక రాక తప్పదని అంటున్నారు. ఏమైనా అధికారం కోసం వ్యూహాలు పన్నేటప్పుడు రాష్ట్రం, ప్రజల నష్టపోకుండా జగన్ చూడాలని లేదంటే ఆయనే నష్టపోతారని వారంటున్నారు.