విజయవాడలో హనుమాన్ జయంతి వేడుకలు
#vijayawada #hanuman jayanthi #bhakthulu #andhrapradesh
విజయవాడ నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి వాతావరణం నెలకొంది. హనుమాన్ దీక్ష విరమణ కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు సేవలందించేందుకు విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ వద్ద ప్రత్యేకంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సుమారు ఐదు వేల మందికి మజ్జిగ అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగర గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ వీరంకి రామచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ప్రముఖులు, దాతలు, సామాజిక సేవకులు కలిసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సహాయ సహకారాలు అందించారు. గుప్తదాతలుగా శ్రీ వక్కలగడ్డ నాగేశ్వరరావు – పుష్పవతి దంపతులు సేవాభావంతో ముందుకు వచ్చి కార్యక్రమానికి సహకరించారు.
అలాగే పడమట ప్రాంతంలోని అతి పురాతన గౌరీశంకర ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ ప్రతినిధి శ్రీ మాది శివయ్య ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు సేవలందించారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
హనుమాన్ భక్తులు గిరి ప్రదక్షిణలో అలసట చెందకుండా చల్లని మజ్జిగ అందించడం ద్వారా సేవా కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు కూడా నిర్వాహకుల సేవాభావాన్ని అభినందించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో మోపిదేవి సీతారామయ్య, జి.రాంబాబు, ఎన్.సురేష్, టి.రమణ, గౌరీశంకర్, బడుగు గణేష్, గన్నవరం శ్రీను, కరిముల్లా, హరిబాబు, శివకుమార్, ప్రసాదు, రాజు, లోకేష్, ముజీబ్ తదితరులు కీలక పాత్ర పోషించారు.