ఈ యుద్ధం ఎవరితో ఎవరు చేస్తున్నారు?
#andhrapradesh #Pawan Kalyan #prasna ravan #politics
ఏపీలో ఒక యుద్ధం నడుస్తోంది. అది పవన్ కల్యాణ్ కు యూట్యూబర్స్ కు మధ్య అనుకుంటున్నారు కదా.. అది పైకి మాత్రమే. అసలు యుద్ధం బిజెపికి, కొన్ని లెఫ్ట్ వర్గాలకు మధ్య నడుస్తోంది. బిజెపి ప్రతినిధిగా పవన్ కల్యాణ్ ను వాళ్లు చూస్తున్నారు.ఈ యూబ్యూబర్స్ ను మాత్రం వైసీపీ బాగా వాడుకుంటుంది. అందుకే పవన్ కల్యాణ్ లేదా జనసేనవాళ్లు వీరిని వైసీపీ పేటీఎం బ్యాచుల్లా చూస్తున్నారు. సోషల్ మీడియాలో కౌంటర్ ఎన్ కౌంటర్ వీడియోలతో రెండు వైపులా గట్టిగా ఫైట్ నడుస్తోంది. లెఫ్ట్ గా పేరు పడ్డ కొంతమంది అయితే ఎప్పుడో పవన్ కల్యాణ్ జగన్ అండ్ కో ను అన్న మాటలను పెట్టి.. వీటికి కేసులుండవా అని .. ప్రశ్న రావణ్ కేసులతో పోలుస్తున్నారు. మీటఇప్పటికే కాషాయవర్గం వీరందరికీ పూర్తిగా వ్యతిరేకం... లేటెస్టుగా జనసేన, టీడీపీ శ్రేణులు కూడా వ్యతిరేకమయ్యాయి. కేవలం వైసీపీ మాత్రమే వీరికి కొమ్ము కాస్తుంది. కాంగ్రెస్ కూడా ఓపెన్ గా వీరికి మద్దతు ఇవ్వడానికి ధైర్యం చేయడం లేదు. ఎందుకీ పరిస్ధితి వచ్చింది?
పవన్ కల్యాణ్ చేగువేరా పేరు చెప్పి పాలిటిక్స్ లో కి వచ్చాడు. అప్పట్లో కొందరు లెఫ్టిస్టులు సంతోషపడ్డారు. కాని మోదీకి మద్దతు ఇవ్వడంతో వారంతా షాకయ్యారు. తర్వాత స్పెషల్ హోదా విషయంలో మోదీని వ్యతిరేకించినప్పుడు మళ్లీ ఖుష్ అయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి, వైసీపీకి వ్యతిరేకంగా లెప్ట్ పార్టీలతో కూటమి కట్టినప్పుడు ఇంకా ఫిదా అయ్యారు. కాని అదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం.. ఎవరో చెప్పిన ప్లాన్ ప్రకారం చేశారన్న ఆరోపణలు వచ్చినప్పుడు నొసలు చిట్లించారు. ఇక అమరావతిపై పోరాడతానని ప్రకటించి.. సడెన్ గా ఢీల్లీకి వెళ్లి బిజెపి పెద్దలతో కలిసి... నేను ఎన్డీయే మనిషినని చెప్పగానే ఆగ్రహించారు. జగన్ మీద ఉన్న వ్యతిరేకతతో రాష్ట్ర ప్రజలు ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకోలేదు. అధికారంలోకి వచ్చాక సనాతన ధర్మం నినాదం.. నిత్యం కాషాయబట్టలతో దర్శనాలతో.. బిజెపికి పవన్ కల్యాణ్ ఏపీయే కాదు.. దక్షిణాదికి కూడా బ్రాండ్ అంబాసిడర్ అని అర్ధం అవగానే ఈ లెఫ్ట్ వర్గాలకు కోపం వచ్చింది. డ్రామాలు వేసి ప్రజలను మోసం చేస్తున్నాడు పవన్ అనేది వారి అభిప్రాయం. నా ఆలోచనలు నావి.. నా ప్లాన్లు నావి.. మీకేంటి నొప్పి అనేది పవన్ అభిప్రాయం.
అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. కాని ఎక్స్ ట్రీమ్ కి వెళ్లిపోవడం వల్లే ఈ పరిస్ధితి వచ్చింది. దూషణ పర్వం విపరీతం కావడంతో .. ఈ యూట్యూబర్స్ కి ఉన్న క్రేజ్ కొన్ని వర్గాలకే పరిమితమైపోయింది. తప్పు చేసినోడిని ప్రశ్నించు.. నిలదీయి.. కాని అది ప్రజలకు అర్ధమయ్యేలా.. అవతలోడి వెనక ఉన్న శ్రేణులు కూడా ఆలోచనలో పడేలా ఉండాలి.. అంతే కాని.. వారంతా నిన్ను ద్వేషించేలా కాదు. ఈ విషయం ఆ యూట్యూబర్లు ఆలోచించాలి. పవన్ చేసిన తప్పులను ప్రజల ముందు పెట్టాలి.. పవన్ ను రాజకీయంగా టార్గెట్ చేయాలి.
కాని పర్సనల్ గా టార్గెట్ చేయడం వలన పవన్ కే లాభం జరుగుతుంది. జగన్ ఈ తప్పు చేయబట్టే పవన్ కు హైప్ వచ్చింది. ఇప్పుడు వీళ్లు కూడా అదే పని చేస్తున్నారు. పవన్ తప్పులు చేయలేదని కాదు.. అడగకూడదని కాదు.. అడగాల్సింది ఇలా కాదు. అనాల్సింది మాత్రం ఇలా కాదు. ఇది యూట్యూబర్లు గుర్తించాలి. ఇదంతా ఒక టీమ్ వర్క్ సోషల్ మీడియాలో చూస్తున్నవారికి అర్ధమైపోతుంది. ప్రశ్న రావణ్ కు మద్దతుగా జడ శ్రవణ్ కుమార్ వస్తాడు. వీరిద్దరూ దళిత క్రైస్తవ సభలో ఆవేశంగా, అనాలోచితంగా ఏది బడితే అది అనేస్తారు. కేసులు వచ్చాక.. అరెస్టులు జరిగేటప్పుడు వారికి మద్దతుగా ఓ తులసిచందు.. ఓ మహువా మీడియా వచ్చేస్తాయి. వీరందరికి మద్దతుగా వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కూడా రెడీ అవుతుంది. ఇవన్నీ పవన్ కల్యాణ్ పై ఆయన పాలోవర్స్ లో సానుభూతి పెంచేస్తాయి. జనసేనలో కొంతకాలంగా కేడర్ లీడర్స్ మధ్య గ్యాప్ పెరిగింది. అందుకే ఈ మధ్య కమిటీల పేరుతో పవన్ కల్యాణ్ ఏదో ప్రయత్నం చేస్తున్నట్లు కనపడుతుంది. అయినా కేడర్ లో అసంతృప్తి పోలేదు. కాని ఈ యూట్యూబర్స్ ఎపిసోడ్ తో జనసేన కేడర్, లీడర్స్ అంతా ఒకటయ్యారు.. వారి ఇంటర్నల్ గొడవలు పక్కన పెట్టేశారు. అంతా మళ్లీ ఎమోషనల్ అయిపోయారు. పవన్ ను కాపాడుకునే పనిలో పడ్డారు. కాపుల విషయంలో కూడా వైసీపీ చేసిన ప్రయత్నం కూడా ఇలాగే బూమరాంగ్ అయింది. పవన్ ను వ్యతిరేకించిన కాపు నేతలు సైతం సమావేశాలు పెట్టి మద్దతు ప్రకటించేదాకా వెళ్లింది.
అయితే యూ ట్యూబర్స్ లిమిట్స్ దాటి మాట్లాడినవాటిపై కేసులు పెట్టొచ్చు.. కాని కావాలని వరుస కేసులు పెట్టి వేధించేలా మాత్రం పవన్ గాని.. ప్రభుత్వాలు గాని చేయకూడదు. యూట్యూబర్స్ కూడా పవన్ అయినా చంద్రబాబు అయినా నిలదీయడం కొనసాగించాలి.. కాని అది ప్రజల తరపున ప్రజల సమస్యలపై చేయాలి.. మీ సొంత అజెండాలతో.. సొంత పైత్యాలతో దాడి చేయాలని చూస్తే వ్యవహారం అడ్డం తిరగడం ఖాయం.