హైదరాబాద్ను బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. తెలంగాణ శాసనసభలో కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ (క్యూర్) బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పాలనను మరింత సమర్థంగా నిర్వహించేందుకు క్యూర్ చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. నగర రవాణా కోసం కాంప్రిహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ సిద్ధం చేశామని తెలిపారు. మూసీ పునరుజ్జీవం తొలిదశకు రూ.7,345.12 కోట్లతో అనుమతులు ఇచ్చామని, 20 టీఎంసీల గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి, అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేసేలా చట్టబద్ధ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు వివరించారు. సీఎం అధ్యక్షతన క్యూర్ అత్యున్నత పాలకమండలిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురుగునీటిని శుద్ధి చేసి చెట్ల పెంపకం, కాలుష్య నివారణకు వినియోగించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 పాలసీతో ముందుకు సాగుతున్నామని, 2034 నాటికి రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.
400 రకాల చిన్న నేరాలపై కీలక నిర్ణయం
తెలంగాణ ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ చట్టం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో చిన్నపాటి సాంకేతికపరమైన 400 రకాల నేరాలను నేరపూరిత పరిధి నుంచి తొలగించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ఈ చట్టంతో వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. చట్టాలపై కలెక్టర్లు, వ్యాపారులకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు.
