రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, కీలక ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా చర్చించారు. శనివారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి, ఆరోగ్య రంగ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.అనంతరం విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్ను జేపీ నడ్డా ప్రారంభించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను వర్చువల్గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసిందన్నారు. కొవిడ్ అనంతరం దేశ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.64 వేల కోట్లతో ఆరోగ్య వ్యవస్థలను మరింత పటిష్టం చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఆరోగ్య రంగ అభివృద్ధికి పలు కార్యక్రమాలను చేపడుతున్న సీఎం చంద్రబాబును నడ్డా అభినందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
