యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలపై ఛార్జీలకు సంబంధించిన చర్చ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. రూ.2,000 వరకు విలువైన UPI లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇటీవల కొన్ని రకాల UPI లావాదేవీలపై వ్యాపారుల నుంచి బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు రుసుములు వసూలు చేసేందుకు అవకాశం కల్పించేలా పార్లమెంట్ ‘పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007’కు సవరణలను ఆమోదించింది. దీంతో UPI చెల్లింపులపై వినియోగదారుల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
రూ.2,000 వరకు ఛార్జీలు ఉండవు
తాజా నోటిఫికేషన్ ప్రకారం.. రూ.2,000 వరకు విలువైన UPI చెల్లింపులపై బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎలాంటి రుసుములు వసూలు చేయకూడదు. ఈ నిబంధన ఎలక్ట్రానిక్ విధానంలో చేసే RuPay డెబిట్ కార్డు చెల్లింపులకు కూడా వర్తిస్తుంది.
అంటే.. రూ.500, రూ.1,000, రూ.2,000 వంటి మొత్తాలను UPI ద్వారా చెల్లించే వినియోగదారులపై అదనపు ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతి లేదు. ఈ పరిమితిలో జరిగే లావాదేవీలపై వ్యాపారుల నుంచి కూడా సంబంధిత రుసుములు వసూలు చేయరాదని కేంద్రం స్పష్టం చేసింది.
రూ.2,000 దాటితే ఏం జరుగుతుంది?
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన UPI లావాదేవీలపై వినియోగదారులు వెంటనే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తాజా నోటిఫికేషన్ చెప్పడం లేదు. అయితే, అధిక విలువ కలిగిన UPI లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) వసూలు చేసేందుకు చట్టపరమైన మార్గం ఇప్పుడు ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా వ్యాపారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం UPI చెల్లింపులు సాధారణంగా వినియోగదారులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అయితే అధిక విలువ గల లావాదేవీలకు సంబంధించిన ఛార్జీలపై భవిష్యత్తులో కేంద్రం, సంబంధిత నియంత్రణ సంస్థలు మరింత స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.
