ఇరాన్తో జరిగిన యుద్ధం అమెరికా రక్షణ రంగంపై తీవ్ర ప్రభావం చూపినట్లు పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు జరిగిన పరిణామాలను విశ్లేషించిన నివేదికలో.. అమెరికా అధునాతన ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. వాటిని తిరిగి భర్తీ చేయడంలో పలు సవాళ్లు ఉన్నాయని, యుద్ధానికి ముందు స్థాయికి ఆయుధ నిల్వలను తీసుకురావడానికి సుమారు మూడేళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆయుధాలు, సైనిక స్థావరాలకు భారీ నష్టం
ఇరాన్ దాడుల కారణంగా కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, జోర్డాన్లలోని అమెరికా సైనిక స్థావరాల్లో వందలాది భవనాలు దెబ్బతిన్నట్లు నివేదిక తెలిపింది. భారీ సంఖ్యలో అమెరికా విమానాలు, డ్రోన్లు కూడా ధ్వంసమైనట్లు పేర్కొంది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కాంగ్రెస్కు వెల్లడించారు.
అమెరికా దౌత్య కార్యాలయాలకూ నష్టం
ఇరాన్ దాడుల్లో అమెరికా దౌత్య కార్యాలయాలకు జరిగిన నష్టాన్ని పెంటగాన్ నివేదిక తొలిసారిగా వెల్లడించింది. ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలోని అమెరికా దౌత్య కార్యాలయాలకు కలిపి సుమారు 184 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది.
యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న సుమారు 9000 మంది అమెరికా పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించినట్లు నివేదిక పేర్కొంది. ఈ తరలింపు చర్యలకు జూన్ చివరి నాటికి 11 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చయినట్లు వెల్లడించింది.
హర్మూజ్ జలసంధిలో మరో వివాదం
ఇదిలా ఉండగా.. హర్మూజ్ జలసంధిలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్పై దాడి ఘటన అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. నావికాదళం అమర్చిన మైన్ను ట్యాంకర్ ఢీకొట్టిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) చేసిన వాదనను అమెరికా సైన్యం ఖండించింది.
